top of page

సంపుటి  5   సంచిక  1

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

నిర్వహణ: దీప్తి పెండ్యాల | మధు పెమ్మరాజు

katha@madhuravani.com 

కౌశికి నుంచి మిసిసిపికి

డా.కే.వి. రమణరావు

టీపాయ్ మీద వున్నరాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా నుంచి గంగకు’ పుస్తకాన్ని తదేకంగా చూస్తున్నాడు రవీంద్రబాబు. మిస్సిసిపినుంచి వచ్చే చలిగాలులు ఆ మధ్యాహ్నం సెయింట్ లూయిస్ సబర్బన్ ఏరియాను చల్లబరుస్తున్నాయి. 

"అయితే యితనేమంటాడు, ఆర్యులు మధ్య ఆసియానుంచి వచ్చారంటాడా. నేనామాట యన్నటికీ నమ్మను. అట్లాగైతే ఈరోజు ఆ ప్రాంతపుదేశాల్లో మన వేదసంస్కృతి ట్రేసెస్ ఐనా వుండాలగదా, యక్కడపోయినట్టు?" అన్నాడు రవీంద్రబాబు కొంచెం ఆవేశంగా. 

 ’ప్రతిమనిషి తన తలలో తనదైన వొక ప్రపంచాన్నే మోస్తూంటాడు’ అంటాడు ప్రముఖ తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి" అన్నాడు జగన్నాథ్ నవ్వుతూ. 

నేనడిగిందానికి జవాబు చెప్పదలుచుకోనప్పుడంతా నువ్వు టాపిక్ మారుస్తావు. అయితే యీ సెయింట్ లూయిస్ లోనే లక్షప్రపంచాలుండాలి. యేవీ?" అన్నాడు రవీంద్రబాబు తనూ నవ్వుతూ. 

స్వగతం

చెరుకూరి రమాదేవి

​అయ్యబాబోయ్ అయ్యబాబోయ్ యెంత వెనక పడిపోయాను.

 

నాతోటి వారంతా యెంత ముందుకు వెళ్ళిపోయారు. కలానికి కాలదోషం పట్టించి, కంప్యూటర్స్ తో  కసరత్తు చేస్తూ, యెంతముందుకు వెళ్ళిపోయారు?

 

పోతన, పూతన అంటూ, ఏవేవో ఫాంట్స్ నేర్చేసుకుని, కంప్యూటర్స్ మీద కథలు రాసేస్తున్నారు. బ్లాగులు సృష్టించేసుకున్నారు. బోలెడు మందిని పోగేసుకుని, వోహో కబుర్లాడేసుకుంటున్నారు. యెంత నైపుణ్యం సంపాష్టించేకుంటున్నారు. హ! ఎంతయినా, తెలుగువారు తెలివైనవారు. మహా ఘనులు.

అయినా,  అంతమంది ఆ కంప్యూటర్ ని వాడేసుకుంటూవుంటే, నేనేనా అంత చేతకాని రచయితని? అందరికంటే ముందు మొదలు పెట్టాను. వెనకపడి పోతానేమిటి? - అనుకుంటూ, నోట్ బుక్స్, పెన్స్ అన్నీ తీసి సొరుగులో పడేశాను.  కంప్యూటర్ on చేసి, పోతన గారు వున్నారో లేదో చూసుకున్నాను. ఫాంట్ కి పోతన అని పెరుపెట్టుకున్నంత మాత్రాన, పోతన అంత పండితులయై పోతారా? పోతనతో  రాస్తే మాత్రం భాగవతం అయిపోతుందా? అని విమర్శించుకుంటూనే మొదలు పెట్టాను. 

ఏ దేశమేగినా 

 వాత్సల్య గుడిమళ్ళ

"త్వరలో ల్యాండ్ అవ్వబోతున్నాము, కాబట్టి అందరూ మీ సీటు బెల్టులని బిగించి కట్టుకోండి" అన్న గగన సఖి మాట వినపడి నిద్ర లేచాను. 

 

టైము ఉదయం ఆరు కావొస్తోంది.నిన్న రాత్రి హైదరాబాదులో బయలుదేరి ఓ ఐదుగంటలు దూరంలో పొరుగు దేశంలో ఉన్న కూతురు దగ్గరకి బయలుదేరాము  నేనూ, నా అర్ధాంగి లక్ష్మి.
 

విమానం దిగి బయటకొచ్చేసరికి అమ్మాయి భావన, అల్లుడు వంశీ   పిల్లలతో సహా వచ్చారు. ఆప్యాయమైన ఆలింగనాలు, గాలి పీల్చుకోవడమంత అనివార్యమయిపోయిన ఫోటోలవీ  అయ్యాకా ఇంటికొచ్చి కూతురు చేసిన వేడి వేడీ ఇడ్లీ తినేసరికి అర్జెంటు టెలిగ్రాం కొడితే బయలుదేరొచ్చినట్లు నిద్రా దేవత పరిగెత్తుకొచ్చింది.

అమ్మాయీ వాళ్ళు ఉన్న ప్రదేశం(చిన్న గ్రామం అనుకోవచ్చేమో)  పేరు "వుడ్స్ విల్లే". అందంగా, పొందిగ్గా, ఎటుచూసినా పచ్చదనం నిండిన గ్రామమది.

మాకు సాయంత్రానికి కాస్త అలసట తీరగానే అలా చల్లగాలికి తిరిగొద్దామని నేనూ, నా అర చొక్కా(అర్ధ+అంగీ=అర్ధాంగి,సవర్ణ దీర్ఘ సంధి) బయటకొచ్చాము. చుట్టూ పచ్చటి చెట్లు, రహదారుల మీద ఒక క్రమంలో సాగిపోతున్న వాహనాలూ,పక్కన పాదచారులు నడవడానికి వీలుగా ఫుట్‌పాత్, ఆ పక్కగా పచ్చటి గడ్డిని చూస్తుంటే ప్రాణానికి హాయిగా అనిపించింది.

తేనెజాబిలి

-సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి

పద్ధతైన పిల్ల, పైగా ఉద్యోగస్తురాలు, ఏ వంకలూ పెట్టకుండా సరే అనరా!” అని అందరూ అంటే, అమ్మాయిని చూసి ‘బానే ఉంది, ఇంతకీ పేరేమిటి?’ అని అడిగాడు మిరియం.

 

‘మల్లిక’ అనగానే మారు మాట్లాడకుండా, సరే! అన్నాడు.

 

మిరియాన్ని సంస్కృతంలో మరీచి అంటారు. 

 

అన్న హితవు లేనివారికి  మిరియం నలిపి,  నెయ్యిలో   వేయించి, మొదటి ముద్దలో పెడితే గొంతు గరగరలు పోయి, గాత్ర శుద్ధయ్యి,  అన్నహితవు కలుగుతుంది. ఈ వంటకాన్ని ఘృతమరీచి అంటారు. 

 

ఆ వంటకం బాగా ఇష్టపడే ముద్గసూపం, తన  కొడుక్కి,  "మిరియం"  అని పెడితే మరీ, జనాలు ఏడిపిస్తారని అందంగా పెట్టిన పేరు మరీచి. 

 

మరీచుడిని ముద్దుగా అందరూ ఇంట్లో మిరియం అని పిలవటం వల్ల అది ఆ నోటా ఈ నోటా పాకి చివరకు రికార్డుల్లో మాత్రమే మరీచిగా, లౌకికంగా మాత్రం మిరియంగా సమాజంలో చలామణీ అవుతోంది.

సీజర్

మూలం: జయకాంతన్ 

అనువాదం: సుందరేశన్

అసలు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయిందనిపిస్తోంది.

 

మేడక్రిందినుంచి గభీమని వినిపించిన సందడిలో - నాన్నగారి కేక విని - నేను పడకనుంచి లేవడానికి భయపడుతూ, ఈ సమయంలో అతని మొహంలో కనిపించకూడదని, లేవకుండానే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, పావుగంటకిపైగా నా మంచంలో దొర్లుతున్నాను. ఇదిగో, నా తలగడకి పక్కనేవున్న కిటికీలోనుంచి  చూస్తే నాకన్నీ బాగా కనిపిస్తున్నాయి. 

అపవాదంకి గురి అయిన మంగళం ఆంటీ - సీతారామయ్యర్ భార్య- ఏడుస్తూ, దేవుడికి మొరపెడుతూ, అందరినీ శపించే మాటలు నాకు నా చెవులకి అందాయి:

“ఇదేం ఘోరం! ఇవేం వెకిలి మాటలు! ఎంత బలవంతంగా వీళ్ళు ఇలాంటి నీలాపనింద నామీద మోపుతున్నారు! రానీ, మా ఆయన రానీ! నా చేతిలో నిప్పు పట్టుకొని నేను అతనిముందు ప్రమాణం చేస్తాను!” 

ఆవిడ మాటలు తలాతోకా లేనట్టూ... కోపం, అహంకారం ఒకేసారి కలిసివచ్చినట్టూ, ఆ ఏడ్పు మధ్య నాకు వినిపించాయి.

bottom of page