top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

వచన కవిత్వ వ్యాకరణం

విన్నకోట రవిశంకర్

ఈ అంశం మీద మాట్లాడటంలో ఒక చిన్న ఇబ్బంది ఉంది.

 

వచన కవిత్వమంటే పడనివాళ్ళకి, అందులో వ్యాకరణం వెతకటమంటే  ఎండమావిలో నీళ్లు, ఇసుకలో తైలం వెతకటం వంటిదనిపించవచ్చు. వేరొకవైపు, వచన కవిత్వాన్ని అమితంగా ప్రేమించే వచనకవుల  దృష్టిలో ఏ అధికరణాలకి, అధికార గణాలకి లొంగని తమ కవిత్వం వ్యాకరణానికి మాత్రం ఎందుకు లొంగాలనే భావన ఉండవచ్చు. ఐతే, ఈ రకమైన వెసులుబాటు, స్వేచ్ఛ వచన కవిత మీద కొంతమందికి చిన్న చూపు ఏర్పడటానికి కారణమా, అందులో వ్యాకరణం పాత్ర ఏమైనా ఉన్నదా అని పరిశీలించటమే ఈ వ్యాసం ఉద్దేశం. 

వచన కవిత్వం వచ్చి 50 సంవత్సరాలైనా, ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందిన కవితా వాక్యాలు దాదాపుగా లేవు (కొన్ని  శ్రీశ్రీ కవితా వాక్యాలు మినహాయిస్తే).

 

ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసాలలో శేషేంద్ర శర్మ కవిత్వం నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించటం కొంత మార్పు. శర్మగారు ఇప్పుడు ఉంటే ఇటువంటి ఆదరణకు తప్పక సంతోషించేవారు. ఐతే, జన సేనాని వరకు వెళ్లిన ఈ కవిత్వం,  జన సైనికుల వరకు చేరిందా అన్నది సందేహమే.  

నవీన రీతులలో పౌరాణిక సాహిత్యం

ప్రభల జానకి

''పురాణాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సమ్మోహనశక్తి ఉంటుంది. ఎందువల్లనంటే సమస్త మానవజాతి యొక్క సమిష్టి బాల్యం వాటిల్లో ఇమిడి ఉంటుంది కనుక'' అంటారు మార్క్స్‌.

 

వివిధ పరిస్థితులలో ఆ పౌరాణిక పాత్రలు చేసిన సంఘర్షణ వల్లనే ఒక ఉదాత్తత - సంపూర్ణత - సార్వకాలీనత వాటి స్వంతమై సీత-రాముడు, ద్రౌపది-కర్ణుడు మొదలైన పాత్రలు పండిత పామర హృదయాల్లో శాశ్వతత్వాన్ని పొందాయి. కానీ మనిషి ఎల్లకాలం పురాణయుగంలోనే ఆశీనుడు కాలేడు. నెమ్మదిగా ఆధునికత వైపు దృష్టి మరల్చి, పురాణగాథలలోకి తొంగిచూస్తూ, గతకాలపు గాథలను సంఘర్షణ రూపంలో విశ్లేషిస్తున్నాడు. కేవలం పురాణ కాలక్షేపంగా కాకుండా నూతన అర్థాలను, భావసంపదను అందించి మన ఆలోచనలను విస్తృతపరుస్తున్నాయి.
 

అసలు ఈ రకమైన ఆలోచనా స్రవంతికి కాళిదాసు మహాకవికి పూర్వుడైన ''భాసమహాకవి''నే ఆద్యునిగా పేర్కొనాలి. భాసుని ''పంచరాత్ర'' నాటకం స్త్రీ పాత్రలు లేని, మహాభారత పాత్రలతో కూడిన కల్పితేతివృత్తం. అంతేకాదు కొంత స్వతంత్రించి తనదైన 'లో'చూపుతో భారత మహిళల జీవితానుభవాలను కాలానుగుణంగా తన నాటకాలలో చిత్రించాడు.

సర్వకళా సారం సాహిత్యం

ఉమా భారతి కోసూరి,

‘సర్వకళాసారం  సాహిత్యం’– అన్ని కళలకి ఆయువుపట్టు సాహిత్యమే అన్నది ఇక్కడి విషయం.  

రోజూవారీ జీవనంలో శ్రమించి విసిగి వేసారిన మనుషులకి..  ఆహ్లాదం, ఉల్లాసం అవసరం కనుక కళలు జనించాయని…. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుని ఉత్తేజపరచే సాధకాలే”  అని ప్రస్తావించారు ఐదవ వేదంగా పరిగణింపబడే నాట్యశాస్త్రంలో కూడా..

పై పేర్కొన్న సంగీతం విషయానికి వస్తే,

‘సంగీతం’ లోని ...గీతం ..సాహిత్యం. చక్కని సాహిత్యంతో మిళితమైతేనే  ... ఓ రాగం, ఓ పల్లవి, ఓ ఆలాపన అపురూపమైన సంగీతం అవుతాయి.

నృత్య కళ సంగతికి వస్తే...అది ఓ కదిలే దృశ్యం,  లయగతుల సమ్మేళనం. 

నృత్యానికి జీవం పోసేది భావమైతే.. భావానికి భాషని సమకూర్చేది సాహిత్యం.  సంగీతానికి మల్లేనే నృత్యకళకి కూడా అయువుపట్టు సాహిత్యం.

కథన కుతూహలం

ఇంద్రాణి పాలపర్తి

ఒక కథ చదవగానే అది చాలా మంచి కథ అని లేదా గొప్ప కథ అని లేకపోతే చాలా నాసిరకంగా ఉందని అభిరుచి గల పాఠకుడికి చప్పున తోచడం కద్దు.కదూ?  అయితే అలా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు ఫలానా కథ బాగులేదని అనిపిస్తుంది? నూటికి తొంభై శాతం కథలు గొప్ప కథలు ఎందుకు కాలేవు?

  ప్రతి రచయితా మంచి కథ రాయాలని ప్రయాసపడతాడు.ఎంతో ఆలోచిస్తాడు,హింస పడతాడు ఒక్కోసారి.చివరకు తాను మంచి కథ రాసానని సంతోషపడతాడు,సంతృప్తి పడతాడు.ఇది ప్రతి రచయితా అనుకునేదే. కానీ ప్రత్రి రచనా మంచి రచన ఎందుకు కాలేకపోతోంది?  

పై ప్రశ్నలకు సమాధానాలను ఈ ఉత్తరంలో రేఖామాత్రంగా వివరిస్తాను.అవి నీకు మంచి కథలు రాయడానికి కొంచమైనా ఉపయోగపడవచ్చు.తీరిక చేసుకుని నెమ్మదిగా చదువు. చదువుతూ చదువుతూ ఆలోచించు.

 

మొదటిది: భాష

 కథకునికి భాష మీద మంచి పట్టు ఉండడం చాలా ముఖ్యం. భాష పేలవంగా ఉండడం అనేది అతి పెద్ద లోటే అనుకో. అలాగే పొడుగైన వాక్యాలు రాయడం,వాక్య నిర్మాణం సరిగ్గా లేకపోవడం,ఆంగ్ల  పదాలను,వాక్యాలను తెలుగులో రాయగల అవకాశం ఉన్నా ఆంగ్లంలోనే రాయడం ఎన్నడూ చేయకు.పద సంపదను పెంచుకుని సుసంపన్నమైన తెలుగు భాష మీద పట్టు పెంచుకో. అలాగని భాషతో విన్యాసాలు చేయిస్తే,భాషను పల్టీలు కొట్టిస్తే,అది గొప్ప కథ అయిపోదు. తెలిసిందా.  

bottom of page