top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

సత్యాన్వేషణ - 18

 ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది?

 

సత్యం మందపాటి

నాకు మొదటినించీ భారతదేశ చరిత్ర, మిగతా దేశాల చరిత్ర, ఆయాదేశాల సాంస్కృతిక మానవ శాస్త్రం (Cultural Anthropology) గురించి చదవటం, తెలుసుకోవటం సరదాగా వుండేది. దానివల్లే రకరకాల కోణాల్లో వ్రాసిన చరిత్ర పుస్తకాలనీ వ్యాసాలనీ చదువుతుంటే, అసలు ఏది చరిత్ర? ఏది నిజం? ఏది నిజం కాదు? ఏది నమ్మాలి? మొదలైన ప్రశ్నలుదయించటం మొదలుపెట్టాయి. అదేకాక ఈమధ్య రిటైరయాక నాకెంతో ఇష్టమైన విషయాల మీద ఎన్నో పుస్తకాలూ, వ్యాసాలూ తీరిగ్గా చదువుతుంటే భారతదేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర కూడా అసలు విషయాలని దాచి, ఎలా తప్పు దారులు పట్టించిందో తెలుస్తున్నది.

ఇవన్నీ చదివాక నాకు అనిపించిందేమిటంటే ఆ చరిత్ర వ్రాసిన వారి ఆలోచనలనుబట్టి, అవసరాలనిబట్టి  ఆ చరిత్ర రకరకాలుగా వుంటుందని. ఉదాహరణకి భారతదేశ స్వతంత్ర పోరాటం గురించి పాకిస్తాన్ చరిత్రకారులు వ్రాసిన దానికీ, మనవాళ్ళు వ్రాసిన దానికీ ఎంతో తేడా వుంటుంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ, నెహ్రూ, జిన్నా, పటేల్లాటి స్వాతంత్రయోదుల గురించి చెప్పేటప్పుడు ఆ చరిత్ర ఎంతో భిన్నంగా వుండే అవకాశం వుంది. ఒక దేశపు దేశభక్తుడు ఇంకొక దేశపు ద్రోహి. అంతేకాదు సౌదీ అరేబియాలో పుట్టి, భారతదేశ స్వాతంత్ర సమరంలో పోరాడిన భారత దేశభక్తుడు మౌలానా అబ్దుల్ కలాం అజాద్ గురించి, రెండు పక్కలా వివిధ అభిప్రాయాలు వున్నాయి.  

అలాగే కొన్ని పుస్తకాల ఆధారంగా మహాత్మా గాంధీ మీద తీసిన సినిమాలు, భారత సెన్సారు వారి అభిప్రాయాలకి అనుగుణంగా కొన్నో, ఎన్నో మార్పులు చెందాయి. రిచర్డ్ అట్టిన్బరో తీసిన గాంధీ చిత్రం భారత ప్రభుత్వానికి నచ్చి కొద్ది మార్పులతో విడుదలయింది. బ్రిటిష్ ఇండియాని తమ సంకెళ్ళనించీ విడిపించిన స్వాతంత్ర పోరాటాన్ని, ఒక బ్రిటిష్ దర్శకుడు ఎంత నిజాయితీగా తీస్తాడు అనే అనుమానాన్ని పూర్తిగా వమ్ము చేసి, ప్రతి సంఘటనకీ చాల ప్రాముఖ్యం ఇచ్చి ఆ సినిమాని నిష్పక్షపాతంగా ఎంతో గొప్పగా తీశాడాయన. కానీ అంతే గొప్పగా అదే నిజాయితీతో తీసిన ఇంకొక సినిమా ‘నైన్ అవర్స్ టు రామ’ ఆనాటి భారత ప్రభుత్వం బారిన పడి, ఇండియాలో బహిష్కరించబడింది. అంతేకాదు స్టాన్లీ ఓల్పర్ట్ వ్రాసిన ‘నైన్ అవర్స్ టు రామ’ పుస్తకం కూడా భారతదేశంలో నెహ్రూ కుటుంబ కాంగ్రెస్ ప్రభుత్వం వారు బహిష్కరించారు. దానికి కారణం, ఆర్.ఎస్.ఎస్ సంస్థకు చెందిన నాథూరాం గాడ్సే కథ అది. మహాత్ముడిని హత్య చేసే ముందర తొమ్మిది గంటలలో జరిగిన గాడ్సే జీవిత సంఘటనలను, చారిత్రిక ఆధారాలతో ఎంతో నిజాయితీగా వ్రాసిన పుస్తకం, తీసిన సినిమా. అది నిషేధించటానికి కారణాలు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే తెలియాలి. అదృష్టవశాత్తూ నలభై ఏళ్ళ క్రితం అమెరికా రాగానే, నేను కొనుక్కున్న మొదటి పుస్తకం అదే. చూసిన ఇండియన్ సినిమా కూడా అదే! గాడ్సే ఎంతో ప్రేమించిన మహాత్మా గాంధీని చంపే ముందర అనుభవించిన మనోవేదన,  పరిస్థితులు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఆ సినిమాలో.

అంటే ఇక్కడ ప్రభుత్వానికి నచ్చని చరిత్ర, చరిత్ర కాదన్నమాట!

ఇలాటి నేపధ్యంలోనే జైపూర్ మహారాజుల గురించీ చదివాను. కొన్నేళ్ళ క్రితం జైపూర్ వెళ్లేముందు, కొంచెం ఎక్కువగానే చదివి, ఈ మహారాజులు ఎలాటివారో వారి నిజ స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను.

జైపూర్ గురించి తెలుసుకునే ముందు ఈ చరిత్రని అక్బర్ జీవితంతో ప్రారంభిద్దాం. అక్బర్ భారత దేశాన్ని ఉద్ధరించటానికి రాలేదు. మొగలాయీల దోపిడీలో పెద్ద భాగస్వామి ఇతడు. వారి సామ్రాజ్య విస్తరణకి, ఎంతో కృషి చేసి, భారతదేశంలో కొంత భాగాన్ని తన కాళ్ళ క్రింద పెట్టుకున్న పెద్దమనిషి. జోదాబాయిని పెళ్లి చేసుకున్నది, హిందూమతానికి దగ్గరయి తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవటానికి. ఈనాటి మన హీరోల సినిమాల్లో చూపిస్తున్నట్టు ప్రేమతో కాదు. పరమత సహనంతో అసలే కాదు. అలాగే సంస్కృత భూయిష్టమైన హిందీ భాషలో ఎన్నో పర్షియన్ మాటలు తీసుకువచ్చి, సంస్కృతాన్ని ఏమాత్రం లేకుండా చేసిన ఉరుదూ భాషా ప్రియుడు. ఇప్పుడు ఇండియాలో రోడ్డు మీద మాట్లాడే జనవారీ హిందీలో, మీకు వినపడేవి ఎన్నో పర్షియన్ పదాలే! మహాభారత్, రామాయణ్ లాటి సీరియల్స్ చూస్తేనే, ఎవరో పండితులు మాట్లాడేది వింటేనే, మనకి హిందీలో సంస్కృతం మళ్ళీ వినిపిస్తుంది. ప్రేమ్ అనే మాట పోయి, మొహబ్బత్, ఇష్క్ వచ్చేశాయి. కష్ట్ పోయి ముష్కిల్ వచ్చేసింది. అలాటివే ఎన్నో.. ఎన్నెన్నో..  ఇప్పుడు సంస్కృతంలో నించీ వచ్చిన హిందీలో కన్నా, ద్రవిడ భాష తెలుగులో ఎక్కువ సంస్కృత పదాలు వున్నాయంటే ఆశ్చర్యంగా వుంటుంది.

 అలాటి అక్బర్ మహారాజు ఇంకా ఏం చేశాడో చూద్దాం. 

రాజపుత్ మహారాజు మాన్ సింగ్ (మొదటి మాన్ సింగ్) గురించి మొదలుపెడదాం. అతను అంబర్ రాజ్యానికి రాజు. మొగలాయీలకి తొత్తుగా మారి, వాళ్ళకి కాళ్ళు వత్తటం మొదలుపెట్టాడు. దానితో అక్బర్ సంతోషించి, ఇంకాసేపు తన కాళ్ళు వత్తించుకుని, అతన్ని తన సభలో నవరత్నాలలో ఒకడిగా గుర్తించాడు. అంతేకాదు అంతటి రాజుగారినీ కాళ్ళ క్రింద తొక్కిపెట్టి, తనకి సైనికాధికారిగా చేసుకున్నాడు. మాన్ సింగుకి జోదాబాయి అత్త అవుతుంది. మాన్ సింగుని రాణా ప్రతాపసింగ్ దగ్గరకి రాయబారం పంపించి ఆ రాజ్యాన్ని కూడా దక్కించుకోవాలని చూశాడు అక్బర్.

‘నేను యుద్ధం చేసి చావటానికయినా సిద్ధమే కానీ, నా మాతృదేశాన్ని ఆక్రమించి, విస్తరించాలని అనుకుంటున్న ఈ మొగలాయీలకి తొత్తుగా మాత్రం మారను’ అన్నాడు రాణా ప్రతాప్ సింగ్.

అలాగే చివరి శ్వాస వదిలేవరకూ, పోరాడి యుద్దంలో చనిపోయాడు రాణా ప్రతాప్ సింగ్.

అందులో అతని మరణానికి ప్రధాన పాత్ర వహించింది మాన్ సింగ్. కానీ రాజస్థాన్ చరిత్ర మాన్ సింగుని ఒక మహానీయుడిగా చిత్రిస్తుంది.

 

మాన్ సింగ్ తర్వాత, జగత్సింగ్, మహాసింగ్, జైసింగ్ 1, తర్వాత కొంత కాలానికి జైసింగ్ 2.. ఇలాటి రాజపుత్ తొత్తుల కాలచక్రం ఇక్కడ తిరుగుతుంటే, అక్కడ అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్.. అలా నడిచింది మొగలాయీల దురాక్రమణ. 

 

మరాఠీ వీరుడు ఛత్రపతి శివాజీ ఏడుసార్లు మొగలాయీల మీదకు దండయాత్రకు వచ్చినా, తమ బలగాల సహాయం మొగలాయీలకి పూర్తిగా ఇచ్చి, శివాజీని ఏడుసార్లూ ఓడించిన ఘనత కూడా ఈ తొత్తు రాజులదే! కానీ బ్రిటిష్ వారూ, కాంగ్రెస్ ప్రభుత్వం వారు, ముస్లిం చరిత్రకారులు వ్రాసిన చరిత్రలో జైపూర్ రాజులంతా హీరోలే.. విలన్లు కాదు.

ముస్లిములు వ్రాసిన చరిత్రలో అఫ్ఘనిస్తాన్లో పుట్టిన మహమ్మద్ గజనీ తర్వాత ఘోరీ రాజ్యం వచ్చినట్లు వ్రాసినది కనిపిస్తుంది. గజనీ క్రీస్తు శకము 1025- 1030 కాలంనాటి వాడయితే, ఘోరి 1192 కాలంనాటి వాడు. అంటే ఇద్దరి మధ్యా 175 సంవత్సరాల చరిత్ర వుంది. అది ఎటువంటిదంటే వారిలో వారే కొట్టుకు చచ్చినంత. ఈ విషయాన్ని కొంత నిశితంగా చూద్దాం. ఈ ఆఫ్ఘన్ - టర్కీ వారి దురాక్రమణని అడ్డుకున్నవాడు రాజా సుహేల్ దేవ్ బాసీ. గజనీని ప్రతిఘటించి, ఓడించిన రాజుల్లో ప్రముఖుడు. గజనీ పదిహేడుసార్లు సోమనాథ్ దేవాలయం, తదితర హిందూ దేవాలయాలు నాశనం చేసి, అక్కడ దేవాలయాలలోని బంగారం, మిగతా ఆస్తులు దోచుకుని పోదామని వచ్చాడు. గజనీని అడ్డుకుని ఎక్కువగా వెనక్కి తరిమిన ఇంకొక రాజు రాజపుత్ విద్యాధర. ఆయన పేరు ముస్లిములు వ్రాసిన చరిత్రలో ఎక్కువగా కనపడదు. చివరికి గజనీని చంపి, రాజ్యం చేజిక్కించుకున్నది గజనీ తమ్ముడి కొడుకు. అలా వాళ్ళలో వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నది చరిత్రలో దాచిపెడితే, తర్వాత ఎన్నో శతాబ్దాల తర్వాత అది బయటికి వచ్చింది.

 

హుమాయూన్, బాబర్, అక్బర్, షాజహాన్ మొదలైన మొగలాయీల కుటుంబ పరంపర గురించి బ్రిటిష్ వారు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు వ్రాసిన చరిత్ర పుస్తకాల్లో వుంటుంది కానీ, మన హిందూ సామ్రాజ్యాల గురించి కూలంకుషంగా ఎక్కడా కనపడదు. మధ్యలో కొంతమందిని వదిలేశారు. ఎందుకంటే వారిలో ముఖ్యులు కొందరు మహారాణులు. అహల్యాబాయి హోల్కర్ మొదలైన వారు ఇటు పోర్చుగీస్ వారినీ, అటు డచ్ వారినీ గడగడలాడించారు. హిందూ దేవాలయలాలని నాశనం చేస్తుంటే వారితో పోరాడి అడ్డుకున్నారు. అలాగే రాణి దుర్గావతి అక్బర్ సామ్రాజ్య విస్తరణకు అడుగడుగునా అడ్డుపడింది. కొందరు హిందూ రాజుల సహాయంతో దుర్మార్గుడు అక్బర్ ఆమెను ఓడించటానికి చివరకు సిధ్ధమవుతుంటే, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధభూమిలో తన ప్రాణాలు తనే తీసుకుంది. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తప్ప ఇలాటి ఎందరో మహారాణుల గురించి చరిత్రలో ఎక్కువగా కనపడదు.

ఇలాటివి చదివిన తర్వాత తెలుసుకునే నిజాలు కొన్ని చాల ఆశ్చర్యంగా వుంటాయి. ఉదాహరణకి అలెక్జాండర్ ది గ్రేట్.. గ్రేట్ కానే కాదు. వాళ్ళ నాన్న కింగ్ ఫిలిప్ గొప్పతనంతో పైకి వచ్చిన రాజు. మేసడోనియా రాజు ఫిలిప్ ముందుగా గ్రీకు దేశాల్ని ఆక్రమించాడు. తర్వాత ఎంతో శక్తివంతమైన పర్షియా దేశాన్ని ఆక్రమించాలన్న అతని కోరిక నెరవేరక ముందే హత్య చేయబడ్డాడు. దానితో ఇరవై సంవత్సరాలకే రాజయాడు అలెక్జాండర్.  మూడుసార్లు పర్షియా మీద దండెత్తి చావుదెబ్బలు తిన్న యుద్ధ పిపాసి. చివరికి నాలుగవసారి పర్షియా మీద గెలిచాడు. తర్వాత చెప్పుకోదగ్గది ఈజిప్ట్ మీద యుద్ధం చేసి గెలవటం. తర్వాత చిన్న చిన్న యుద్ధాలే చేశాడు కానీ, చెప్పుకోదగ్గవి ఏవీ లేవు. చివరికి అతని సైన్యమే, మంచి యుద్దవీరుడికి ఎప్పుడు యుద్ధం ఆపాలో తెలుస్తుందనీ, అతనికి అది కూడా తెలియదనీ చెప్పి, ఇక యుద్ధం చేయమని మొండికేసి వెనుతిరిగింది. అదీ అలెక్జాండర్ ది గ్రేట్ గొప్పదనం. గ్రీకువీరుడి యుద్ధ పిపాస! ఆయన గొప్పతనం చూపించాలని వారే వ్రాసుకున్న చరిత్ర!

అలాగే కొలంబస్ ఒక సముద్రపు దొంగ. అతను అమెరికాని కనుక్కోక ముందే, అమెరికా లక్షణంగా అప్పటినించీ ఈర్రోజుల్లోని మా ఇంటి ముందరా, మీ ఇంటి వెనకాలా వుండనే వుంది. ఎక్కడికీ పోలేదు. సుబ్బారావుగారింటికి బయల్దేరి, అప్పారావుగారింటికి వెళ్లి, అదే సుబ్బారావుగారి ఇల్లు అనుకున్న వెర్రి మాలోకం కొలంబస్. ఇండియా వెళ్లి, అక్కడి నించీ సిల్కు, బంగారం, రత్నాలు, మిరియాలు తెస్తానని స్పానిష్ మహారాణిని వూరించి, ఆవిడ దగ్గర ప్రయాణ ఖర్చులు కొట్టేసి, తూర్పు దిశగా వెడతానని అటు తిరిగి దణ్ణం పెట్టకుండా, తూర్పు అటే అనుకుంటూ పడమటి దేశాలకు వచ్చిన, దిక్కూ దివాణం తెలియని మనిషి. మొదటిసారి బహామా ద్వీపాలకి వచ్చి అదే ఇండియా అన్నాడు. రెండోసారి వెనిజువేలా వచ్చి అదే ఇండియా అన్నాడు. మూడోసారి మధ్య అమెరికా వచ్చి అదే ఇండియా అన్నాడు. వాళ్ళని ఇండియన్స్ అన్నాడు. అందుకే ఇక్కడ ఆ రోజులనించీ వున్న స్థానిక ప్రజలని ఇండియన్స్ అంటారు. కొలంబస్ మాత్రం కొన్ని వేల సంవత్సరాలనించీ ఇక్కడే వున్న అమెరికాని ‘కనుక్కున్న’ గొప్పవాడిగా అమెరికా దేశ చరిత్ర చెబుతున్నది. సంవత్సరంలో ఒక రోజు ‘కొలంబస్ డే’ అనే పేరుతో సెలవు కూడా వుంది. అదీ వారు వ్రాసుకున్న చరిత్ర.

అలాగే 1732 ప్రాంతంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీవారు, బ్రిటిష్ వారి ఆక్రమణకు కొంచెం ముందుగా ఇండియాని ఆక్రమించాలని ప్రయత్నం చేసినప్పుడు, వారిని ఎదుర్కొనటమే కాక, వారిని చావుదెబ్బ కొట్టి వెనక్కి పంపించిన రాజు రాజా మార్తాండవర్మ. ఆయన గురించి కూడా చరిత్రలో మనమెవ్వరూ చదువుకోలేదు.  

ఆనాటి నెహ్రూ కాంగ్రెస్ గవర్నమెంటు, ఢిల్లీ మొగలాయీల ఘన చరిత్రే భారతదేశ చరిత్రగా ప్రచారం చేసి, పాఠ్య పుస్తకాలు కూడా అలాగే తయారు చేయించింది. అందుకనేనేమో చోళ, పల్లవ, శాతవాహనరాజుల చరిత్ర కూడా పూర్తిగా వెలికి రాకపోగా, ఈనాటికీ ఇంకా ఎంతో తెలుసుకోవాల్సినది వుంది. మనని పాలించిన మొగలాయీలు, బ్రిటిష్ వారూ, వారి తొత్తులూ, నెహ్రూ వంశ పరంపరా మన అసలు చరిత్రకి అన్యాయం చేసి, వాళ్ళు చెప్పినదే మన చరిత్ర అని నమ్మించారు.

ఇజ్రాయిల్, వెస్ట్ బాంక్ సరిహద్దుల్లో కొన్ని దశాబ్దాలుగా యుద్ధం జరుగుతున్నది. మరి ఇజ్రాయిల్ వాళ్ళు వ్రాసే చరిత్రలో ఇజ్రాయిల్ వాళ్ళు దేశభక్తులు, పాలస్తీను వాళ్ళు ఉగ్రవాదులు. అదే చరిత్ర పాలస్తీను వారు వ్రాస్తే, పాలస్తీను వాళ్ళు దేశభక్తులు, ఇజ్రాయిల్ వాళ్ళు ఉగ్రవాదులు.

ఇంతకుముందు మన మధురవాణిలో నా సత్యాన్వేషణ శీర్షికలోనే ‘ద్వేషమా! నిన్ను ప్రేమించేవాళ్ళు కూడా వున్నారా?’ అనే వ్యాసం వ్రాశాను. దానిలో యూరప్ నించీ అమెరికాకు వలస వచ్చినవారు ఇక్కడ వేలకు వేల స్థానికులని పసిపాపలతో సహా ఊతకోచ కోసిన కథలు, మసిబారిన అమెరికా చరిత్రలో మారిపోయి అమెరికన్ హీరోల విజయాల కథలయాయి. ఎన్నో ‘గొప్ప’ సినిమాలుగా వచ్చాయి.

ఆఫ్రికానించీ యూరప్, అమెరికా మొదలైన ‘తెల్ల’ దేశాలకు బానిసలుగా తీసుకువచ్చి ఆనాడు నల్లవారిని ఎంతగా హింసించారో, అప్పుడే కాక ఈనాటికీ వారిని ఎంతగా హింసిస్తున్నారో చూస్తే మనసు వికలమైపోతుంది. మానవత్వమా ఎక్కడున్నావ్ అని అవి చదువుతున్నప్పుడల్లా ప్రశ్నించుకోవాల్సి వస్తుంది.

అంతదాకా ఎందుకు, మన పెరటిలోనే, తెలుగుదేశంలోనే అలాటిది వుంది.

ప్రపంచమంతా ముందుకు పోతుంటే, కులాల పోరాటాలు, హత్యలూ, దురభిమానాలూ, సంకుచిత బుద్దులూ, డబ్బు కోసం సాటి మనిషినే పీక్కు తినటం ఈనాడు వున్నంతగా తెలుగువాళ్ళల్లో ఏనాడూ లేవు.

ఈనాటి వార్తలే, వార్తా పత్రికలే, టీవీ వార్తలే రేపటి చరిత్ర. ఒక్కొక్కపార్టీకి ఒకటో రెండో చెంచా పత్రికలు. ఒకటో రెండో చెంచా టీవీ ఛానళ్ళు. మరి ఏది ఎవరి గురించి చెప్పేది నిజం? ఒక వంద ఏళ్ల తర్వాత ఏది చరిత్రగా ఆనాటి చరిత్రకారులు, ప్రజలు లెఖ్క వేస్తారు?

ఇప్పుడే కొందరు ‘ఇది’ నమ్మ్మితే, కొందరు ‘అది’ నమ్ముతున్నారు. అది వారి మతాలను బట్టి, కులాలను బట్టి, రాజకీయాలని బట్టి అని వేరే చెప్పనఖ్కర్లేదు.

ఇది ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలోనూ వుంది. దేశ ప్రగతిని, ప్రపంచ ఆర్ధిక పరిస్థితిని, ఒకే ఒక అబద్ధంతో దేశాన్ని, ప్రపంచాన్నీ సర్వనాశనం చేసి, అధోగతిలోకి తీసుకు వెళ్లారు ఆనాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, ఉపాధ్యక్షుడు డిక్ చేనీ. వాళ్లకి హారతి పడతారు ఒక ‘వర్గం’ వారు.

ఎనిమిదేళ్ళలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళి, ముఖ్యంగా సామాన్య ప్రజల ప్రగతి కోసం శ్రమించి, ఫలితాలు చూపించిన ఒక నల్ల అధ్యక్షుడికి, కనీస గౌరవం కూడా ఇవ్వలేక పోయారు శ్వేతజాతి అహంకార్లు. ఆయన పాతాళానికి వెడుతున్న దేశాన్ని ప్రగతి పథం వేపు మళ్ళీ దారి మళ్లించి ముందుకు నడిపించటం, దేశ ఆర్ధిక ప్రగతే చూపిస్తున్నది. Numbers won’t lie! ఇందాక చెప్పిన వర్గం వారు చెబుతున్న వార్తలు, వ్రాస్తున్న చరిత్ర, ఆయన ఒక ఉగ్రవాది అనీ, కమ్యూనిష్ట్ అనీ, ఇరాక్ మీదా, ఇరాన్ మీదా, ఇతర దేశాల మీదా యుద్దానికి పోవటం చేతకాని పిరికిపంద అనీ, ముస్లిం దేశాలతో చేతులు కలుపుతున్న దేశద్రోహి అనీ చిత్రిస్తున్నాయి. అలాగే ద్వేషం నరనరాలా పాతుకుపోయి, తన వర్గం వారినీ, శ్వేతజాతి అహంకారుల్నీ తప్ప ఇంకెవరినీ మనుష్యులుగా గుర్తించని ఒక అమెరికా అధ్యక్షుడికి అదే గూటి పక్షులు రోజుకి మూడుసార్లు దీపారాధన చేస్తున్నారు. మరి ఇంకో వంద సంవత్సరాల తర్వాత చరిత్ర ఇలాటి వారి గురించి ఏమని చెబుతుందో! ఆనాటి ప్రజలు ఏది నిజమని నమ్మాలో! హిట్లర్ చరిత్రకి ఇది కొంచెం దగ్గరగా వుండటం యాదృచ్ఛికం కాదు.

కాకమ్మ కథలనీ, పుక్కిటి పురాణాల్నీ కూడా చరిత్రగా సమర్ధిస్తారు కొంతమంది మత పిచ్చివాళ్ళు. ఇది ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ వుంది. కొన్ని మతాల్లో ఎక్కువ, కొన్ని మతాల్లో తక్కువ. అంతే! ఫలానా దేవుడి పాదాల ముద్రలు మావూళ్ళో వున్నాయి అని కొందరు నమ్మి అక్కడ ఒక గుడి కడితే, ఇదే చోట ఫలానా మా మత ప్రవక్తని చంపేశారు అని ఇంకొకరు అంటారు. అది కూడా ప్రపంచం నలుమూలలా అన్ని మతాల్లోనూ,  మీ వూళ్ళో కాదు, మా వూళ్ళో అని కొట్టుకునేదాకా వచ్చారు. ఒక పెద్ద మతానికే గొప్పవాడయిన మత ప్రవక్త తెల్లవాడని తెల్లవాళ్ళు అంటే, నల్లవాడని నల్లవాళ్ళు అంటారు. ఇంకొక మతంలో వారి దేవుడు నల్లవాడని మొదటి నించీ గ్రంధాలలో వున్నా, ఆ నలుపు రంగు నచ్చక వారి దేవుడికి వేరే రంగు పులిమేసుకుంటున్నారు.

కొందరు మా మతమే నిజమైన చరిత్ర, మిగతా మతాలన్నీ కట్టు కథలే అనటం కూడా మనం చూస్తున్నాం.

నాకు ఇలాటి విషయాల గురించి చదువుతుంటే, కొంచెం ఆవేదనగా కూడా వుంటుంది.

మనకి ఈనాడు తెలిసిన చరిత్రలో ఏది చరిత్ర? ఎంతవరకూ నిజం? ఏది కల్పన?  

ఇంకో వంద సంవత్సరాల తర్వాత మన చరిత్ర చదివేవారికి, నిజంగా జరిగిన విషయాలను మనం ఎంతవరకు అందిస్తున్నాం?

అలాటప్పుడు నాకు శ్రీశ్రీగారి కవిత గుర్తుకివస్తుంది.

“ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?

నరజాతి సమస్తం, పరపీడన పరాయణత్వం!

నరజాతి చరిత్ర సమస్తం. పరస్పరాహరణోద్యోగం! 

చల్లారిన సంసారాలూ, మరణించిన జన సందోహం,

అసహయుల హాహాకారం, చరిత్రలో మూలుగుతున్నవి.

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ, ఒక జాతిని వేరొక జాతీ పీడించే సాంఘిక ధర్మం

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?”

***

(నేను ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు చదివి ఎంతో పరిశీలనతో వ్రాసిన వ్యాసం ఇది. ఇందులో కొన్ని తప్పులున్నాయి అని నాలాగే చరిత్ర గురించిన చదివినవారు అనే అవకాశం వుంది.  ఏది సత్యం? ఏదసత్యం? అని అనుమానంగా వున్న నేనే, ఈ చరిత్ర చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు అలోచనల్లో పడ్డాను. అలాటి విషయాల్లో మీ అభిప్రాయలు విభిన్నంగా వుంటే నాకు తెలుపగలరు. నాకూ నిజానిజాలు తెలుసుకోవాలనే వుంది. ఈ వ్యాసం ఉద్దేశ్యం కూడా సత్యాన్వేషణ కదూ! ముందుగానే మీకు ధన్యవాదాలు)

*****

bottom of page